Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Reddy Labs releases Corona drug with name Redyx




Reddy Labs releases Corona drug with name Redyx
కరోనా డ్రగ్ విడుదల చేసిన రెడ్డీ ల్యాబ్స్
హైదరాబాద్‌లోని రెడ్డీస్ ల్యాబ్స్ శుభవార్త అందించింది. కరోనా వైరస్‌కు రెడీఎక్స్ డ్రగ్‌ను విడుదల చేసినట్లు ప్రకటన చేసింది. అమెరికా సంస్థతో ఒప్పందం చేసుకొని ఈ డ్రగ్‌ను ఇండియాలో అందుబాటులోకి తీసుకొచ్చింది.

హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రముఖ ఔషధ సంస్థ ‘రెడ్డీస్ లెబొరేటరీస్ లిమిటెడ్’ శుభవార్త అందించింది. కొవిడ్-19 డ్రగ్‌ను విడుదల చేసినట్లు ప్రకటించింది. గిలెడ్ సైన్సెస్‌ అభివృద్ధి చేసిన రెమిడిసివిర్ (Remdesivir) డ్రగ్‌ను ‘రెడిక్స్’ (Redyx) పేరుతో లాంచ్ చేసినట్లు బుధవారం (సెప్టెంబర్ 9) ప్రకటన చేసింది. 100 మి.గ్రా. పరిమాణంలో రెడిక్స్ మందును లాంచ్ చేసినట్టు రెడ్డీస్ సంస్థ పేర్కొంది. గిలెడ్ సైన్సెస్ సంస్థతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా డ్రగ్‌ను లాంచ్ చేసినట్లు తెలిపింది.

కరోనా రోగులకు చికిత్స కోసం ‘రెమిడిసివిర్‌’ ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. ఈ యాంటీ వైరల్‌ డ్రగ్‌ను అమెరికాకు చెందిన గిలెడ్‌ సైన్సెస్‌ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం కరోనాతో పరిస్థితి విషమించిన రోగులకు మాత్రమే ఈ డ్రగ్‌ను వాడటానికి భారత్‌లో అనుమతి ఇచ్చారు. భారత్ సహా 127 దేశాల్లో ఈ డ్రగ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

ఆక్సిజన్‌ సపోర్ట్‌ అవసరమైన కేసుల్లోనే తక్కువ డోస్‌లో రెమిడిసివిర్‌ వాడేందుకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)కి చెందిన ‘డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)’ ఇటీవల అనుమతి ఇచ్చింది. రెడ్డీస్ ఔషధ సంస్థతో పాటు దేశీయంగా పలు ఫార్మా కంపెనీలు ఈ డ్రగ్ ఉత్పత్తిని ప్రారంభించాయి. దీంతో ఈ ఔషధం విస్తృతంగా అందుబాటులోకి రానుంది. జూన్ నెలాఖరు కల్లా భారత మార్కెట్‌లో రెమిడిసివిర్ ఔషధం అందుబాటులోకి వస్తుందని గిలెడ్ సంస్థ జూన్ నెలలోనే ప్రకటన చేసింది.

ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఈ డ్రగ్‌ను ప్రస్తుతం గర్భిణిలు, 12 ఏళ్ల లోపు పిల్లలు, ఇతర సమస్యలతో బాధ పడుతున్న వారికి ఉపయోగించవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దేశంలో ఈ డ్రగ్ ఉత్పత్తికి 6 కంపెనీలు దరఖాస్తు చేసుకోగా.. ఐదింటితో గిలెడ్ సైన్సెస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. 

అమెరికాలో కరోనా రోగులకు చికిత్సలో ఈ ఔషధాన్ని ఉపయోగించగా మెరుగైన ఫలితాలు వచ్చాయి. అయితే.. అక్కడ కూడా ఈ ఔషధాన్ని అత్యవసర కేసుల్లోనే వైద్యుల పర్యవేక్షణలో వాడుతున్నారు. ఈ డ్రగ్ సామర్థ్యం, భద్రత, అదనపు సమస్యలు తదితర అంశాలకు సంబంధించి క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్స్ లేవని తేలితే.. ఈ ఔషధాన్ని విరివిగా ఉపయోగించే అవకాశం ఉంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags