Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Schools and Colleges may Open from Dec 1

 


TS: Schools and Colleges may Open from Dec 1

డిసెంబరు నుంచి విద్యాలయాలు తెరుద్దాం - విద్యాశాఖ ప్రాథమిక నిర్ణయం


తొలుత 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకే అనుమతి

విభాగాల అధిపతులతో చర్చించిన చిత్రా రామచంద్రన్‌

మరో భేటీ తర్వాత సీఎంకి ప్రతిపాదనలు పంపనున్న విద్యాశాఖ 

పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను డిసెంబరు 1 నుంచి తెరిచి విద్యార్థులకు తరగతిగది బోధన అందించాలని విద్యాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చింది. విద్యాసంస్థలను ఎప్పుడు తెరవాలి.. అందుకు ఎలాంటి నిబంధనలు పాటించాలి.. అనే అంశాలపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ న‌వంబ‌రు 10న‌ విద్యాశాఖలోని వివిధ విభాగాల అధిపతులతో సమావేశం ఏర్పాటుచేసి అభిప్రాయాలు తెలుసుకున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన, ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్, పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకుడు శ్రీహరి తదితరులు భేటీలో పాల్గొన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు విద్యాసంస్థలను తెరిచాయని, మరికొన్ని దీపావళి తర్వాత తెరిచేందుకు తేదీలను ప్రకటించాయని, ఆయా రాష్ట్రాల్లో అనుభవాలను పరిశీలించి డిసెంబరు 1 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలను ప్రారంభించాలని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. 

పాఠశాల విద్యాశాఖలో మొదట 9, 10 తరగతులు.. వాటితో పాటు ఇంటర్‌ క్లాసులు ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. డిసెంబరు ఒకటి నుంచి ఇంజినీరింగ్‌ తరగతులు మొదలుపెట్టాలని ఇప్పటికే అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) కాలపట్టికను విడుదల చేసిందని, ఈ క్రమంలో డిగ్రీ, పీజీ కళాశాలలతో పాటు విశ్వవిద్యాలయాలను కూడా డిసెంబ‌రు నుంచి తెరిస్తే మంచిదని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి సూచించినట్లు తెలిసింది. ‘విద్యాసంస్థలను హడావిడిగా తెరిచే ఉద్దేశం లేదు.. విద్య ఎంత ముఖ్యమో.. పిల్లల ఆరోగ్యమూ  అంతే ముఖ్యం’ అని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కళాశాల/సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారి నవీన్‌ మిత్తల్‌ బిహార్‌ నుంచి వచ్చాక మరోసారి చర్చించాలని నిర్ణయించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రతిపాదనలు పంపి ఆమోదం తీసుకోనున్నారు. వసతి గృహాలను తెరవడంపై సాంఘిక, గిరిజన సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులతోనూ చిత్రా రామచంద్రన్‌ చర్చించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags