Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభ వార్త

 


తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభ వార్త

తెలంగాణ ఉద్యోగులకు వేతనం పెంపు!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. అన్ని శాఖల ఉద్యోగులకు వేతనాలు, పదవీ విరమణ వయస్సును పెంచాలని నిర్ణయించారు. దీనికోసం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలో ఓ కమిటీని సీఎం నియమించారు. వేతనాల పెంపు సహా వివిధ అంశాలపై ఆ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్క్ చార్జ్‌డ్, డెయిలీ వైజ్, ఫుల్ టైమ్ కాంటింజెంట్, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులతో పాటు హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పింఛనుదారులు.. ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని సీఎం ప్రకటించారు. అన్నిరకాల ఉద్యోగుల కలిపి రాష్ట్రంలో 9,36,976 మంది ఉంటారని.. అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని సీఎం చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు తక్కువ వేతనాలు కలిగిన ఉద్యోగులున్న ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచాలని కేసీఆర్‌ నిర్ణయించారు. అవసరమైతే వేతనాల పెంపుతో ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం పేర్కొన్నారు. మరోవైపు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆయన ఆదేశించారు. 

వివిధ అంశాలపై కమిటీ అధ్యయనం.. 

వేతనాల పెంపుతోపాటు ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, పదోన్నతులు, అవసరమైన బదిలీలు చేయడం, సరళతరమైన సర్వీసు నిబంధనల రూపకల్పన, రిటైర్ అయ్యే రోజే ఉద్యోగులకు అన్నిరకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా వీడ్కోలు పలకడం, కారుణ్య నియామకాలు చేపట్టడం తదితర ఉద్యోగ సంబంధ అంశాలన్నింటినీ ఫిబ్రవరిలోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు సీఎం చెప్పారు. అన్నిశాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టనున్నట్లు వివరించారు.  ఈ అంశాలన్నింటిపై అధ్యయనం చేయడంతో పాటు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు సీఎస్‌ సోమేశ్ కుమార్ అధ్యక్షతన కమిటీని నియమించారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ జనవరి మొదటి వారంలో వేతన సవరణ సంఘం నుండి అందిన నివేదికను అధ్యయనం చేసి రెండోవారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం కానుంది. 

Previous
Next Post »
0 Komentar

Google Tags