Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Very Severe Cyclone May Hit East Coast on May 26: IMD

 

Very Severe Cyclone May Hit East Coast on May 26: IMD

Cyclone Yaas: తూర్పు తీరానికి పొంచి ఉన్న ముప్పు - అతి తీవ్ర తుఫానుగా యాస్ 

ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి తుఫానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇది అత్యంత తీవ్ర తుఫానుగా మారి మే 26న ఒడిశా- బెంగాల్ మధ్య తీరం దాటుతుందని శనివారం వెల్లడించింది. ప్రస్తుతం అల్పపీడనం తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం వద్ద కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా మారి తర్వాత తుఫానుగా రూపాంతంరం చెందుతుంది. 

‘‘తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మే 23 ఉదయం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదిలి మే 24 నాటికి తుఫానుగా మారుతుంది. తర్వాత 24 గంటల్లో అత్యంత తీవ్ర తుఫానుగా మారుతుంది’’ అని ఐఎండీ పేర్కొంది. అనంతరం ఇది ఉత్తర-వాయువ్య దిశగానే ప్రయాణించి పశ్చిమ్ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ మధ్య మే 26న సాయంత్రం తీరం దాటుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో మే 22, 23 తేదీలలో అండమాన్ దీవుల్లోని పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

ఒడిశా, పశ్చిమ్ బెంగాల్‌లోని చాలా ప్రదేశాల్లో మే 25, 16 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మే 23 ఉదయం నుంచి మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రంలో గంటలకు 75 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయి. ఆ తర్వాత ఇవి క్రమంగా 85 కిలోమీటర్ల వేగానికి పెరుగుతాయని, మే 25 వరకు ఇలాగే కొనసాగుతాయని వివరించింది. మే 26 తెల్లవారుజాము నుంచి బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరం వెంబడి గాలుల వేగం 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. 

గతవారం పశ్చిమ తీరంలో తౌక్టే పెను తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. పశ్చిమ తీరంలోని కేరళ, కర్ణాటక, గుజరాత్, గోవా, మహారాష్ట్రలపై ఈ తుఫాను విరుచుకుపడింది. గుజరాత్‌లోని పోరుబందర్ వద్ద తీరం దాటిన ఈ తుఫాను బీభత్సం సృష్టించింది. ముంబయి తీరంలో ఓఎన్‌జీసీకి చెందిన పీ305 నౌక తుఫాను గాలులకు మునిగిపోయింది. దీంతో నౌకలో 270 మంది చిక్కుకుపోగా, 186 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 49 మంది ఇప్పటి వరకూ చనిపోగా, గల్లంతయిన మిగతావారి ఆచూకీ ఇంకా లభించలేదు.

Previous
Next Post »
0 Komentar

Google Tags