Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: ‘పది’లో రెండుసార్లు బోర్డు పరీక్షలు - సీబీఎస్‌ఈ విధానాన్ని అనుసరించే యోచన


TS: ‘పది’లో రెండుసార్లు బోర్డు పరీక్షలు - సీబీఎస్‌ఈ విధానాన్ని అనుసరించే యోచన

త్వరలో ఎస్‌సీఈఆర్‌టీ, ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారుల చర్చలు

కొత్త విద్యాసంవత్సరం(2021-22)లో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. సీబీఎస్‌ఈ విధానాన్ని స్వల్ప మార్పులు చేర్పులతో రాష్ట్రంలోనూ అమలు చేయడంపై రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ), ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్‌ఎస్‌సీ బోర్డు) అధికారులు కసరత్తును ప్రారంభించనున్నారు.

విద్యార్థుల అభ్యసన ఫలితాల మదింపు విధానంలో మార్పులు చేయాలని, తూతూమంత్రంగా పరీక్షలు జరిపి ఇష్టారాజ్యంగా మార్కులు/గ్రేడ్‌లు ఇవ్వొద్దని ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ ఆయా రాష్ట్రాలకు సూచించింది. ఈక్రమంలోనే సీబీఎస్‌ఈ ఈసారి విద్యాసంవత్సరాన్ని టర్మ్‌-1, 2లుగా విభజించి రెండుసార్లు బోర్డు పరీక్షలు జరుపుతామంది. తొలి ఆర్నెల్ల పరీక్ష నవంబరు/డిసెంబరులో సగం సిలబస్‌కు బహుళ ఐచ్ఛిక ప్రశ్నల(ఎంసీక్యూ) రూపంలో ఉంటుందని తెలిపింది. రెండో పరీక్ష మిగిలిన సగం సిలబస్‌కు నిర్వహిస్తామంది. ఈ రెండింటిలో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకొని తుది ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొంది.

సీబీఎస్‌ఈ బాటలో! 

సీబీఎస్‌ఈ ప్రకటించినట్లుగా రాష్ట్రంలోనూ రెండుసార్లు బోర్డు పరీక్షలు జరిపే విధానంపై అధికారులు చర్చించనున్నారు. సాధారణంగా నాలుగు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్లు(ఎఫ్‌ఏ), ఒక సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌(ఎస్‌ఏ-1)తో పాటు వార్షిక పరీక్షలు(ఎస్‌ఏ-2) జరుపుతారు. గత రెండేళ్లుగా వార్షిక పరీక్షలు జరగలేదు. గత విద్యాసంవత్సరం(2020-21) ఎఫ్‌ఏ-1 ఆధారంగా పదో తరగతిలో గ్రేడ్‌లు ఇచ్చారు. సాధారణంగా ఎస్‌ఏ-1ను జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు(డీసీఈబీ) ప్రశ్నపత్రాలను తయారుచేసి పంపిస్తుంది. ఈసారి సీబీఎస్‌ఈ మాదిరిగానే వాటిని బోర్డు తయారుచేసి పంపిస్తే ఎలా ఉంటుందన్న దానిపై యోచిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఒకే ప్రశ్నపత్రం ఉంటేనే తుది పరీక్షలకు వెయిటేజి ఇవ్వడంలో హేతుబద్ధత ఉంటుందని కొందరు సూచిస్తున్నారు. వచ్చే నవంబరు, డిసెంబరు వరకు ప్రత్యక్ష బోధన లేకుంటే అప్పుడు ఇళ్ల నుంచే ఆఫ్‌లైన్‌/ఆన్‌లైన్‌లో పరీక్షలు జరపాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. అది రాష్ట్రంలో సాధ్యమేనా అన్న ప్రశ్న అధికారుల్లో తలెత్తుతోంది. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ త్వరలో ఎస్‌సీఈఆర్‌టీ, ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారుల సమావేశం ఉంటుందని, అందులో చర్చిస్తామని తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags