Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IITs to offer B.Ed Courses, says Union Education Minister

 

IITs to offer B.Ed Courses, says Union Education Minister

ఐఐటీలలో త్వరలో బీఈడీ కోర్సులు - కేంద్ర విద్యాశాఖ మంత్రి 

ప్రస్తుతమున్న బీఈడీ కాలేజీల్లో ఎక్కువశాతం ఆశించిన స్థాయిలో శిక్షణ ఇవ్వలేకపోతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో దేశంలో నాణ్యమైన ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న ఆయన.. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో బీఈడీ శిక్షణను ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడతామన్నారు. ఇందుకోసం నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ITEP) త్వరలోనే ప్రారంభం అవుతున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

దేశంలో చాలా బీఈడీ కాలేజీలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. మనం ఆశించిన ఉపాధ్యాయులను తీర్చుదిద్దుకోలేకపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ మంచి ఉపాధ్యాయులు లేకపోతే... నాణ్యమైన విద్యను ఆశించలేం. దీన్ని దృష్టిలో ఉంచుకొని రానున్న తరం ఉపాధ్యాయులకు మంచి శిక్షణ ఇవ్వాలని ప్రధాని మోదీ సూచించారు. అందుకే ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ను (ITEP) పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నాం' అని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఐఐటీలు ఉత్తమ కేంద్రాలని అభిప్రాయపడిన ఆయన.. ఒకవేళ ఔత్సాహిక ఉపాధ్యాయులకు ఐఐటీలు శిక్షణ ఇచ్చినట్లయితే విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడంతోపాటు ఉపాధ్యాయుల స్థాయి కూడా పెరుగుతుందని అన్నారు. ఐఐటీ భువనేశ్వర్‌లో ఏర్పాటు చేసిన నూతన కేంద్రీయ విద్యాలయం ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడిన ధర్మేంద్ర ప్రధాన్.. భవిష్యత్తుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్తంగా 'ప్రధానమంత్రి శ్రీ స్కూల్స్'ను ఏర్పాటు చేయనున్నామని అన్నారు.

దేశవ్యాప్తంగా మొత్తం 15వేల పీఎం శ్రీ స్కూళ్ల ను ప్రారంభిస్తామని.. కేవలం ఒడిశాలోనే 500 నుంచి 600 పాఠశాలలు ఏర్పాటు చేయనున్నామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. అయితే, అన్నీ కొత్త పాఠశాలలే కాకుండా ఏవైనా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రీయ పాఠశాలలను వీటి పరిధిలోకి తీసుకొస్తామని అన్నారు. ఇక నాలుగేళ్ల బీఈడీ కోర్సును అందించేందుకుగాను ఐఐటీ భువనేశ్వర్‌తోపాటు పలు ఐఐటీలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. కేంద్ర విద్యాశాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఈ కోర్సును ప్రారంభిస్తాయి. ఈ ఏడాది నుంచే ఐఐటీ భువనేశ్వర్ నాలుగేళ్ల బీఈడీని మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags