Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

PMSBY: Pradhan Mantri Suraksha Bima Yojana – All the Details Here

 

PMSBY: Pradhan Mantri Suraksha Bima Yojana – All the Details Here

పీఎమ్ ఎస్ బీవై: ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన – పూర్తి వివరాలు ఇవే

ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన అనేది ఒక సామాజిక భద్రతా పథకం. 2015 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు సామాజిక భద్రతా పథకాలలో ఇదీ ఒకటి. మిగిలిన రెండు పధకాలు ప్రధాన మంత్రి జీవన జ్యో తి బీమా యోజన (PMJJBY), అటల్ పెన్షన్ యోజన (APY).

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) అంటే ఏమిటి?

ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన అనేది ప్రమాద బీమా పథకం. పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా లేదా వైకల్యం పొందినా ఈ పథకం అండగా ఉంటుంది. దీని కాలపరిమితి ఒక సంవత్సరం. ప్రతి ఏటా దీనిని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.

అర్హత..

* 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో చేరవచ్చు. ఇందుకోసం ఏదైనా బ్యాంకులో పొదుపు ఖాతా ఉండాలి.

* ఒకవేళ మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటే, అప్పుడు మీరు ఏదైనా ఒక బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకంలో చేరే అవకాశం ఉంటుంది.

* ఉమ్మడి ఖాతా విషయానికి వస్తే, ఖాతాలో పేర్లు ఉన్నవారందరూ ఈ పథకంలో చేరవచ్చు. * ఎన్ఆర్ఐలు కూడా ఈ పధకంలో చేరడానికి అర్హులు. కానీ క్లెయిమ్ చేయాల్సి వచ్చిన సమయంలో లబ్ధిదారుడికి నామినీకి భారత కరెన్సీలో చెల్లింపు చేస్తారు.

ప్రీమియం ఎంత, ఎలా చెల్లించాలి?

ఈ పథకానికి వర్తించే ప్రీమియంను ఇటీవలే ప్రభుత్వం రూ. 12 నుంచి రూ. 20కి పెంచింది. దీంతో పాటు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన ప్రీమియంను కూడా పెంచింది. ఇంతకు ముందు పీఎంజేజేబీవై ప్రీమియం రూ. 330 ఉండగా తాజాగా రూ. 436కి పెంచింది. అంటే రెండు పథకాలకు కలిపి రోజుకి రూ. 1.25 ప్రీమియం చెల్లించవలసి వస్తుంది. చెల్లింపులకు ఆటో డెబిట్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ప్రతీ సంవత్సరం జూన్ 1 లోగా మీ బ్యాంకు ఖాతా నుంచి ఆటో డెబిట్ పద్ధతిలో కట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ జూన్ 1 - తరువాత ఆటో డెబిట్ పద్ధతి ద్వారా మీ ఖాతా నుంచి డబ్బు కట్ అయినట్లయితే ఆ తేదీ నుంచి బీమా పథకం అమలు అవుతుంది.

ప్రతి సంవత్సరం జూన్ 1 లోగా పాలసీని పునరుద్ధరించుకోవలసి ఉంటుంది. ఎవరైనా చందాదారుడు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల ద్వారా ఈ పధకంలో చేరినట్లైతే, క్లెయిమ్ సమయంలో కేవలం ఒక బ్యాంకు ఖాతాకు మాత్రమే చెల్లిస్తారు. ఇతర బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లించిన ప్రీమియంను కోల్పోవలసి ఉంటుంది. ప్రీమియం అనేది క్లెయిమ్ చేసిన దాని ఆధారంగా మారుతూ ఉంటుంది. అయితే, ఊహించని ప్రతికూల ఫలితాలను మినహాయిస్తే మొదటి మూడేళ్ళలో ప్రీమియంలో ఎటువంటి మార్పులు ఉండవు. అలాగే, చందాదారులకు బ్యాంకులు పాలసీకి సంబంధించిన ఎలాంటి పాలసీ సర్టిఫికెట్ ను జారీచేయవు.

కవరేజ్ ఎంత?

ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన పథకం కింద చందాదారుడు ప్రమాదానికి గురై మరణించినా లేదా శాశ్వతంగా వైకల్యానికి గురైనా రూ. 2 లక్షలు, పాక్షిక వైకల్యానికి గురైతే రూ.1 లక్ష పరిహారం లభిస్తుంది. ప్రమాదంలో రెండు కళ్ళు పూర్తిగా కోల్పోయినా, రెండు చేతులు/కాళ్ళు కోల్పోయినా దానిని శాశ్వత వైకల్యంగా గుర్తిస్తారు. అదే ఒక కాలు లేదా ఒక చెయ్యి కోల్పోయి, కంటి చూపు కోల్పోయినా దానిని పాక్షిక వైకల్యంగా గుర్తిస్తారు.

గమనిక: చందాదారులు దీనిని అదనంగా ఏదైనా ఇతర బీమా పథకంతో కలిపి కవర్ చేసుకోవచ్చు. ఇది మెడిక్లెయిమ్ పాలసీ కాదు, అందువల్ల ఈ పథకం ద్వారా మీకు ఎలాంటి ఆసుపత్రి ఖర్చులు తిరిగిరావు. కేవలం ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత, పాక్షిక వైకల్యం సంభవించినప్పుడు మాత్రమే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

బీమా ఎప్పుడు వర్తిస్తుంది?

సహజ విపత్తుల కారణంగా జరిగిన ప్రమాదాలు, మరణం లేదా వైకల్యం మాత్రమే ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకం కింద కవర్ అవుతుంది. ఆత్మహత్య చేసుకున్న సందర్భాల్లో ఈ పథకం వర్తించదు. ఇలాంటి సందర్భాల్లో వారి కుటుంబానికి కూడా ఎలాంటి బీమా ప్రయోజనం లభించదు. ఒకవేళ చందాదారుడు హత్యకు గురైతే మాత్రం బీమా కవరేజ్ లభిస్తుంది.

పథకం లో ఎలా చేరాలి?

ఈ పథకాన్ని ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, అలాగే బ్యాంకుల సహకారంతో ఇతర సాధారణ బీమా సంస్థల నుంచి పొందవచ్చు. బ్యాంకులు వారి చందాదారుల కోసం ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సాధారణ బీమా సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి.

DOWNLOAD APPLICATION FORM

ఈ పథకంలో చేరడానికి, మీరు ద్వా రా అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకుని, దానిని పూర్తి చేసి మీ బ్యాంకులో అందించాలి. కొన్ని బ్యాంకులు ఎస్ఎంఎస్ ఆధారిత నమోదు ప్రక్రియను కూడా ప్రారంభించాయి. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ పథకంలో చేరవచ్చు.

ఆన్ లైన్ ద్వారా పీఎంఎస్ బీవైకి నమోదు చేసుకునే విధానం..

నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉన్నవారు ఆన్ లైన్ ద్వారా ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు.

* ముందుగా నెట్ బ్యాంకింగ్ లాగినయ్యి ఇన్సురెన్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

* ఏ ఖాతాను ఉపయోగించి ప్రీమియం చెల్లించాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకోవాలి.

* అన్ని వివరాలను తనిఖీ చేసుకుని నిర్ధారించుకోవాలి. 'ఎక్ నాలెడ్జ్ మెంట్'ను డౌన్ లోడ్ చేసుకోవాలి. భవిష్యత్తు రిఫరెన్స్ కోసం దీన్ని భద్రపరచుకోవాలి.

గమనిక.. బ్యాంకు పొదుపు ఖాతాకు ఇచ్చిన నామినీనే ఇక్కడ సూచిస్తుంది. చందాదారుడు అదే నామినీని ఎంచుకోవచ్చు లేదా కొత్త నామినీని ఎంచుకోవచ్చు. ఇక్కడ సాధారణ ప్రాసెస్ ను ఇవ్వడం జరిగింది. మీరు ఎంచుకున్న బ్యాంకును బట్టి దరఖాస్తు విషయంలో చిన్న చిన్న మార్పులు ఉండవచ్చు.

ఎప్పుడు రద్దవుతుంది?

కింది తెలిపిన వాటిలో ఏదైనా జరిగితే చందాదారుడి ప్రమాద కవరేజ్ ముగిస్తుంది.

* చందాదారుని వయసు 70 ఏళ్ళ వయస్సు దాటినప్పుడు

* బ్యాంకు ఖాతాను మూసివేయడం లేదా బీమాను కొనసాగించేందుకు సరిపడా మొత్తం మీ ఖాతాలో లేకపోవడం.

* ఒకవేళ చందాదారుడు ఒకటి కంటే ఎక్కువ ఖాతాల ద్వారా పథకంలో చేరి ప్రీమియం చెల్లిస్తున్నట్లైతే, బీమా కవర్ కేవలం ఒక ఖాతాకు మాత్రమే పరిమితం అయి మిగిలిన ఖాతాల ద్వారా చేసిన బీమా పాలసీలు రద్దవుతాయి.

క్లెయిమ్ కోసం ఏం చేయాలి?

ప్రమాదవశాత్తు చందాదారుడు మరణిస్తే, దాన్ని ధ్రువీకరించడానికి సరైన పత్రాలను సాక్ష్యంగా చూపించినట్లైతే పీఎంఎస్ బీవై పథకం కింద క్లెయిమ్ మంజూరు అవుతుంది. ఒకవేళ రోడ్డు, రైలు, ఏదైనా వాహన ప్రమాదం, నీటిలో మునిగిపోవడం, హత్యకు గురికావడం వంటి మరణాలు సంభవించినట్లైతే వాటిని పోలీసులకు ధ్రువీకరించాలి. అలాగే పాము కాటు, చెట్టు పై నుంచి కింద పడి చనిపోయినట్లైతే ఆ మరణాలను ఆసుపత్రి వారు ధ్రువీకరించాల్సి ఉంటుంది. అప్పుడే, ఈ పథకం ద్వారా క్లెయిమ్ లభిస్తుంది.

చందాదారుడు మరణించిన సందర్భంలో, అభ్యర్థన నమోదు పత్రం ప్రకారం నామినీ క్లెయిమ్ కోసం దాఖలు చేయవచ్చు. ఒకవేళ నామినీ పేరును అభ్యర్థన నమోదు పత్రంలో తెలుపకపోతే అప్పుడు చాందాదారుని చట్టపరమైన వారసుడు క్లెయిమ్ కోసం దాఖలు చేసుకోవచ్చు. మరణం తాలూకా క్లెయిమ్ లు నామినీ/ చట్టపరమైన వారసుల బ్యాంకు ఖాతాలో జమవుతాయి. అదే వైకల్యం తాలూకా క్లెయిమ్ లు మాత్రం చందాదారుడి బ్యాంకు ఖాతాలో జమవుతాయి. 

CLICK FOR DETAILS

Previous
Next Post »
0 Komentar

Google Tags