Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

త్వరలో డీఎస్సీ - ఉపాధ్యాయ ఖాళీలపై లెక్క తేల్చిన విద్యాశాఖ

 

త్వరలో డీఎస్సీ - ఉపాధ్యాయ ఖాళీలపై లెక్క తేల్చిన విద్యాశాఖ 

402 బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన

మరో 15,926 నియామకాలకు ప్రతిపాదనలు 

ఆంధ్ర రాష్ట్రంలో 16వేలకుపైగా ఉపాధ్యాయ ఖాళీలున్నట్లు పాఠశాల విద్యాశాఖ లెక్క తేల్చింది. వీటిలో 402 బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వ ఆమోదం లభించింది. మరో 15,926 నియామకాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరాయి. ఈ మేరకు మొదట మినీ డీఎస్సీ, ఆ తర్వాత సాధారణ డీఎస్సీ నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ముందుగా బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడనుంది. ఇందులో మిగిలిన వాటిని జనరల్‌కు మారుస్తారు. నియామక పరీక్షతోపాటే ఉపాధ్యాయ అర్హత పరీక్షనూ (టెట్‌) నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. టెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఇప్పటికే తేదీలను నిర్ణయించినా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈసారి పాఠ్య ప్రణాళికనూ మారుస్తున్నారు. ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యం ఇస్తున్నందున అభ్యర్థుల్లోని ఆంగ్ల నైపుణ్యాన్ని పరీక్షించనున్నారు.

ఉపాధ్యాయుల ఖాళీలు భారీగా ఉండడంతో సాధారణ డీఎస్సీ నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. హేతుబద్దీకరణ, బదిలీల అనంతరం అధికారులు ఖాళీల వివరాలను సేకరించారు. భర్తీకి అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి ఇంకా ఆమోదం లభించలేదు. 16వేలకుపైగా ఖాళీల్లో ఎన్నింటికి ఆర్థికశాఖ ఆమోదం తెలుపుతుందో స్పష్టత రాలేదు. ఇటీవల సీఎం జగన్‌ నిర్వహించిన సమీక్షలోనూ పోస్టుల భర్తీ ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది. బ్యాక్‌లాగ్‌ డీఎస్సీ ప్రకటన వెలువడినప్పటి నుంచి అన్నీ సవ్యంగా జరిగితే నియామకాల పూర్తికి రెండున్నర నెలల సమయం పడుతుంది. నియామకాల ప్రకటనకు పరీక్షకు మధ్య 45 రోజులు సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం పరీక్ష, ఫలితాలు, కౌన్సెలింగ్‌కు మరో నెల వరకు సమయం పడుతుందని అంచనా. ఆ తర్వాతే సాధారణ డీఎస్సీకి ప్రకటన ఉండొచ్చు. 

ఎస్జీటీలకు పెన్ను, పేపర్‌తో

డీఎస్సీ-2018లో ఆన్‌లైన్‌ నియామకాల కారణంగా ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈసారి సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు (ఎస్జీటీ) పేపరు, పెన్నుతో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. డీఈడీ, బీఈడీ చేసినవారు ఈ పోస్టులకు అర్హులుగా ఉండడంతో దరఖాస్తులు లక్షల్లో వస్తున్నాయి. అందుకే గత డీఎస్సీలో ఎస్జీటీ నియామకాలకు 16 విడతలుగా పరీక్షలు నిర్వహించారు. దీంతో కొన్ని విడతలకు ప్రశ్నపత్రం తేలికగా వచ్చిందంటే, మరికొన్ని సార్లు కఠినంగా వచ్చినట్లు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎస్జీటీ పరీక్షను ఒకే విడతలో నిర్వహించాలని నిర్ణయించారు. స్కూల్‌ అసిస్టెంట్లు, ఇతర పోస్టులకు మాత్రం ఆన్‌లైన్‌లోనే పరీక్ష ఉంటుంది. 

రెండేళ్లకుపైగా ఎదురుచూపులు

ఒక పక్క కొత్త డీఎస్సీకి ప్రతిపాదనలు సిద్ధమవగా, రెండేళ్ల క్రితం ప్రకటించిన డీఎస్సీ-2018లోని అన్ని పోస్టులు ఇంకా భర్తీ కాలేదు. న్యాయ వివాదాలతో కొన్ని నియామకాలు నిలిచిపోయాయి. మొత్తం 7,902 ఖాళీలకు ప్రకటన ఇవ్వగా.. 860 పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో స్కూల్‌ అసిస్టెంట్లు తెలుగు, భాషా పండితులు (తెలుగు) కలిపి 374 వరకు ఉన్నాయి. మిగతావి వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు.

న్యాయస్థానం తీర్పు అనంతరం వీటి నియామకాలకు చర్యలు తీసుకోనున్నారు. సాధారణ డీఎస్సీ కంటే ముందే వీటిని భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే నియామక ప్రకటన చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags