Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఉద్యోగులకు విద్యుత్ ద్విచక్ర వాహనాలు – మొదటి ఫేజ్ లో లక్ష మందికి – నెలవారీ వాయిదాల్లో చెల్లింపులు

 

ఉద్యోగులకు విద్యుత్ ద్విచక్ర వాహనాలు – మొదటి ఫేజ్ లో లక్ష మందికి – నెలవారీ వాయిదాల్లో చెల్లింపులు

జూలై లో ప్రారంభించనున్న నెడ్ క్యాప్

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు విద్యుత్ ద్విచక్ర వాహనాలను అందించాలని పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్ క్యాప్) నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు కేంద్రం నుంచి అనుమతి లభించింది. తొలిదఫాలో లక్ష వాహనాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న నెడ్ క్యాప్.. జులై మొదటి వారంలో ఈ పథకం ప్రారంభించనుంది. ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండా నెలవారీ వాయిదాలు కట్టేలా వాహనాల తయారీ సంస్థలతో నెడ్ క్యాప్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వరంగ సంస్థల్లోని ఆసక్తి గల సిబ్బంది ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని సమాచారం పంపింది. బ్యాటరీ సామర్థ్యం, వేగం ఆధారంగా వాహనాల ధర ఉంటుంది.

రాష్ట్రంలో సుమారు 80 లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఒక్కో వాహనానికి రోజుకు సగటున అర లీటరు పెట్రోలు వంతున వాడినా, 40 లక్షల లీటర్లు అవసరం అవుతుంది. వీటివల్ల వెలువడుతున్న కాలుష్యం, కర్బన ఉద్గారాలను కొంతైనా తగ్గించడానికి విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలని నెడ్ క్యాప్ భావిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో సుమారు 10 లక్షల మంది సిబ్బంది ఉండగా.. తొలివిడతలో లక్ష మందికి వీటిని అందిస్తుంది. నెలవారీ వాయిదాను సిబ్బంది జీతం నుంచే నేరుగా చెల్లించేలా వాహన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. మూడు సంవత్సరాల పాటు వాహనాల నిర్వహణ బాధ్యత కూడా తయారీ సంస్థదే.

కిలోవాట్‌కు రూ.10 వేలు సబ్సిడీ

ఒక్కో కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యానికి రూ.10 వేలు చొప్పున కేంద్రం రాయితీ ఇస్తుందని నెడ్ క్యాప్ ఎండీ రమణారెడ్డి తెలిపారు. బండి వేగాన్ని బట్టి గరిష్ఠంగా రూ.25వేల నుంచి రూ.30 వేల వరకు సబ్సిడీ వస్తుంది. నెడ్ క్యాప్ అందించే వాహనాలు గంటకు 25-55 కి.మీల వేగంతో నడవనున్నాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ రాయితీ సొమ్ము చెల్లిస్తుంది. వెహికల్ టెస్టింగ్ ల్యాబ్ ఆమోదించిన నమూనాలను పరిశీలించి రాష్ట్రంలో విక్రయానికి పలు సంస్థలకు కేంద్రం ఆమోదం తెలిపింది. 'సాధారణ ఉద్యోగి రోజుకు సగటున అర లీటరు చొప్పున నెలకు 15 లీటర్ల పెట్రోలు కొనేందుకు సుమారు రూ.1500 ఖర్చు చేయాల్సి వస్తోం ది. విద్యుత్ వాహనానికి ఒకసారి బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే మూడు యూనిట్లు ఖర్చవుతుంది. సుమారు 100 కి.మీ ప్రయాణించవచ్చు. ఇంట్లోనే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. పెట్రోలుకు వెచ్చించే మొత్తానికి ఇంకొంత కలిపితే నెలవాయిదా సరిపోతుంది' అని అధికారులు చెబుతున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags