Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

జనగామ శ్రీమంతుడు - 6 కోట్ల సొంత డబ్బులతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణం

 

జనగామ శ్రీమంతుడు - 6 కోట్ల సొంత డబ్బులతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణం 

చదువు నేర్పిన పాఠశాలను రాష్ట్రానికి రోల్ మోడల్‌గా అధునాతనంగా తీర్చిదిద్దారు. ఆయనే సుభాష్ రెడ్డి. మూడు ఎకరాల విస్తీర్ణంలో 33 తరగతి గదులను నిర్మించారు. సుమారు 6 కోట్ల సొంత డబ్బులతో కార్పొరేట్ స్కూల్‌ను తలదన్నేలా జిల్లా పరిషత్ పాఠశాలను తీర్చిదిద్దారు. మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రామానికి అంకితం చేశారు.

కామారెడ్డి జిల్లా బీబీపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. సుమారు 653 మంది విద్యార్ధులు చదివే ఈ పాఠశాలను ఆధునిక హంగులతో కార్పొరేట్ పాఠశాలను తలదన్నేలా నిర్మించారు పూర్వ విద్యార్ధి తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం 6కోట్లు వెచ్చించి ఈ పాఠశాలను మూడు ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో నూతన భవనం నిర్మించారు. ల్యాబ్‌లు, లైబ్రరీలతో పాటు తరగతి గదులు, కంప్యూటర్ గదులు ఇలా సుమారు 33 గదులను నిర్మించారు.

బిల్డర్‌గా స్ధిరపడ్డ సుభాష్ రెడ్డి 8 నుంచి 10వ తరగతి వరకు బీబీపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఇప్పుడు చదువు నేర్పిన పాఠశాలకు నూతన భవనాన్ని నిర్మించారు. అంతర్జాతీయ స్కూల్స్ తరహాలో విశ్రాంతి గదులు, ఒకేసారి 300 మంది సమావేశమయ్యేలా కాన్ఫరెన్స్‌ హాల్‌, హెడ్‌ మాస్టర్‌కు, ఉపాధ్యాయులకు ప్రత్యేక గదులు నిర్మించారు. ఈ పాఠశాలలో చదివి ఉన్నత స్ధానాలకు విద్యార్ధులు చేరుకుంటే తన లక్ష్యం నెరవేరినట్లు అవుతుందని చెబుతున్నారు దాత సుభాష్ రెడ్డి.

ఈ సందర్భంగా మహేశ్ బాబు సినిమా శ్రీమంతుడు చూసి స్పూర్తి పొంది భవనాలను నిర్మించానని దాత పేర్కొనడంతో.. త్వరలో నిర్మించే జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి ఆయన్నే తీసుకొస్తానని మంత్రి మాటిచ్చారు. అనంతరం ప్రారంభోత్సవ చిత్రాలను ట్విటర్‌లో పోస్టు చేశారు. దీనిపై మహేశ్ బాబు బుధవారం ట్విటర్‌లో స్పందించారు. పాఠశాల భవనాన్ని నిర్మించిన సుభాష్ రెడ్డిని నిజమైన హీరోగా అభివర్ణించారు. కళాశాల భవన నిర్మాణం పూర్తయ్యాక బీబీ పేటకు శ్రీమంతుడు సినిమా బృందంతో వస్తానని తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags