Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Assembly approves new revenue bill - New chapter in Telangana



Assembly approves new revenue bill - New chapter in Telangana
నూతన రెవెన్యూ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం - తెలంగాణలో కొత్త అధ్యాయం
తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలైంది. నూతన రెవెన్యూ చట్టానికి శాసనసభ ఆమోదం తెలిపింది. దీంతో పాటు వీఆర్వో వ్యవస్థ రద్దుకు అసెంబ్లీ ఆమోదించింది.
తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. నూతన రెవెన్యూ చట్టానికి తెలంగాణ శానససభ ఆమోదం తెలిపింది. ఎలాంటి సవరణలు లేకుండానే బిల్లుకు ఆమోదముద్ర వేయడం విశేషం. దీంతో పాటు రెవెన్యూ వ్యవస్థను రద్దు శాసనసభ తీర్మానం చేసింది. దీంతో పాటు పురపాలక చట్టం-2020 సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శుక్రవారం (సెప్టెంబర్ 11) అసెంబ్లీలో ‘తెలంగాణ భూమి హ‌క్కులు, ప‌ట్టాదారు పాస్‌బుక్‌ల బిల్లు-2020’పై సుదీర్ఘ చర్చ జరిగింది. సభ్యులు పలు సూచనలు చేశారు. సభ్యులు లేవనెత్తిన ఆయా అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వివరణ ఇచ్చారు. అనంతరం బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు.
ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే.. రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలు కొనసాగుతాయి. చ‌ట్టంలో అన్నీ తీసేయ‌డం లేదు. ప‌లు చ‌ట్టాల స‌మాహారంగా రెవెన్యూ చ‌ట్టం కొనసాగుతుంది. ప్రజలకు ఇబ్బంది క‌లిగించే అంశాల‌ను మాత్రమే తొల‌గిస్తున్నాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
రెవెన్యూ బిల్లుపై చర్చలో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు. రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రెవెన్యూ బిల్లు ఆమోదం అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.. శాసనసభను సోమవారానికి వాయిదా వేశారు.
చ‌ట్టంలో అన్నీ తీసేయ‌డం లేదని.. ప‌లు చ‌ట్టాల స‌మాహారంగా రెవెన్యూ చ‌ట్టం కొనసాగుతుంద‌ని కేసీఆర్ పేర్కొన్నారు. ‘రెవెన్యూ సంస్కర‌ణ‌ల్లో ఇది తొలి అడుగు. స‌మైక్య రాష్ట్రంలో 160 నుంచి 170 వ‌ర‌కు చ‌ట్టాలు ఉండేవి. ప్రస్తుతం తెలంగాణ‌లో 87 చ‌ట్టాలు ఉన్నాయి. ధ‌ర‌ణి మాత్రమే కాదు, మిగ‌తా చ‌ట్టాలు కూడా ఉంటాయి. ఆర్‌వోఆర్‌, ధ‌ర‌ణి స‌ర్వస్వం కాదు. ప్రజ‌ల‌కు ఇబ్బంది క‌లిగించే అంశాల‌ను మాత్రమే తొల‌గిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
కొత్త రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా ప్రవేశ‌పెడుతున్న ధ‌ర‌ణి పోర్టల్‌ను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. ధ‌ర‌ణి పోర్టల్ గురించి ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అస‌వ‌రం లేద‌ని.. భూ రికార్డుల విష‌యంలో ఎలాంటి అనుమానం అవ‌స‌రం లేదని పేర్కొన్నారు. భూ రికార్డుల‌ను మూడు ర‌కాలుగా స్టోర్ చేస్తున్నట్లు తెలిపారు. ఇ-రికార్డు, డిజిట‌ల్ రికార్డు, డాక్యుమెంట్ రూపంలో భూ రికార్డులు ఉంటాయ‌ని వివరించారు. వ్యవ‌సాయ భూముల‌కు ఆకుప‌చ్చ పాస్‌బుక్‌‌లు, వ్యవ‌సాయేత‌ర భూముల‌కు ముదురు ఎరుపు పాస్‌బుక్‌లు ఇస్తామ‌ని తెలిపారు.
ధ‌ర‌ణి వెబ్‌సైట్ ఒకే స‌ర్వర్ మీద ఆధార‌ప‌డ‌కుండా దేశంలో ఎక్కడ భ‌ద్రమైన ప్రాంతాలు ఉంటాయో అక్కడ స‌ర్వర్లు ఉంటాయి. స‌ర్వర్ల కోసం ఎంత ఖ‌ర్చైనా వెనుకాడ‌బోం’ అని కేసీఆర్ పేర్కొన్నారు. గవర్నర్ తమిళిసై ఆమోదంతో నూతన రెవెన్యూ బిల్లు 2020 చట్టంగా అమల్లోకి రానుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags