Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Exams for Secretariat jobs from today .. These two are mandatory for candidates


Exams for Secretariat jobs from today .. These two are mandatory for candidates
నేటి నుంచే సచివాలయం ఉద్యోగాలకు పరీక్షలు.. అభ్యర్థులకు ఈ రెండు తప్పనిసరి!

సెప్టెంబరు 20 నుంచి 26 వరకు పరీక్షలు
సచివాలయం పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సెంటర్ ఆవరణలోకి ప్రవేశించే ముందే వారి శరీర ఉష్ణోగ్రతను థర్మల్‌ స్క్రీనింగ్‌ ద్వారా గుర్తిస్తారు. జ్వరం ఉన్నవారిని వేరే గదుల్లో ఉంచి పరీక్షలు రాయిస్తారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలు ఆదివారం నుంచి ప్రారంభంకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,208 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 13 విభాగాల్లోని పోస్టులకు 10.56 లక్షల మంది పోటీపడుతున్నారు. కరోనా వ్యాప్తి తర్వాత లక్షల సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలు రాయడం ఇదే తొలిసారి. సెప్టెంబరు 20 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ప్రతి రోజూ ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రెండు పూటలా పరీక్షలు జరగనున్నాయి. తొలి రోజు పరీక్షకు ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో మండల కేంద్రాల్లోనూ సెంటర్లు ఏర్పాటు చేశారు.

సచివాలయం ఉద్యోగ పరీక్షలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోపలకు అనుమతించబోమని అధికారులు తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. కొవిడ్‌ నేపథ్యంలో అభ్యర్థులు మాస్క్, శానిటైజర్‌తో పరీక్షకు విధిగా హాజరుకావాలని పేర్కొన్నారు. పాజిటివ్‌ బాధితులు, అనుమానితుల కోసం ప్రత్యేక గదిని సిద్ధం చేసినట్టు వివరించారు.

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా పరీక్షల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌-19 లక్షణాలున్న వారి కోసం ప్రత్యేకంగా ఐసొలేషన్‌ గదులను ఏర్పాటుచేశారు. ఈ గదుల్లోని ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లు ఇస్తున్నారు. విద్యార్థులు గుమిగూడి ఉండకుండా వారికి సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. విద్యార్థుల హాల్‌టికెట్లపై ఉండే బార్‌కోడ్‌ను స్కాన్‌చేసి పరీక్ష గదుల సమాచారం అందిస్తున్నారు.

కరోనా వ్యాప్తితో వాయిదా పడిన డిగ్రీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ నియామకాల రాత పరీక్షలు మొదలయ్యాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందా.. లేదా? ఉద్యోగాల భర్తీ ఉంటుందా.. లేదా? అన్న ఆందోళనలో ఉన్నవారికి ఈ పరీక్షల నిర్వహణ కాస్త ఉపశమనం కలిగిస్తోంది. పరీక్ష కేంద్రాల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నా బయట పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్థుల మధ్య దూరం కనిపించడం లేదు. కొందరు మాస్కులూ పెట్టుకోవడం లేదు. దీనివల్ల కరోనా విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags