Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

టి‌ఎస్: ఎంసెట్ ద‌ర‌ఖాస్తుకు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు - ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌

 

టి‌ఎస్: ఎంసెట్ ద‌ర‌ఖాస్తుకు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు - ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌

సొంత ఫోన్‌ నంబరే ఇవ్వాలి

దరఖాస్తులు నింపేటప్పుడు సరిచూసుకోవాలి

పూర్తిగా ఇంటర్నెట్‌ కేంద్రం నిర్వాహకులపై ఆధారపడొద్దు

ఎంసెట్‌ దరఖాస్తులను నింపి...ఆన్‌లైన్‌లో సమర్పించడానికి ఇంటర్నెట్‌ కేంద్రాల నిర్వాహకులు, కళాశాలల సిబ్బందిపై పూర్తిగా ఆధారపడొద్దు. తప్పని పరిస్థితులుంటే దరఖాస్తుల్లో వివరాలు భర్తీ చేసిన తర్వాత ఒకట్రెండు సార్లు సరిచూసుకొని తప్పులు లేకుండా పంపండి’ అని ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఎ.గోవర్ధన్‌ విద్యార్థులకు సూచిస్తున్నారు. 

ఎంసెట్‌ నోటిఫికేషన్‌ ఎప్పుడు?

సాధారణంగా ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్‌ వస్తుంది. మరో వారంలో ఎంసెట్‌ కమిటీ సమావేశమవుతుంది. అందులో ప్రకటన ఎప్పుడివ్వాలో నిర్ణయిస్తాం. విద్యార్థులు మొదట్లోనే దరఖాస్తు చేసుకోవడం మంచిది. చివరి నిమిషంలో హడావిడి పడితే వివరాల నమోదులో తప్పులు దొర్లుతాయి. దానివల్ల పరీక్షల సన్నద్ధతపై పూర్తిగా దృష్టి సారించలేరు.

  దరఖాస్తు సమయంలో విద్యార్థులు చేసే పొరపాట్లు ఏమిటి? 

చాలా మంది విద్యార్థులు వారు చదివే కళాశాలల సిబ్బంది, ఇంటర్నెట్‌ కేంద్రాల నిర్వాహకులపై ఆధారపడి దరఖాస్తులను పంపుతున్నారు. ఆన్‌లైన్‌ ఫారాన్ని నింపిన తర్వాత సరిచూసుకోవడం లేదు. దాంతో వేల దరఖాస్తుల్లో వివరాలు తప్పుగా ఉంటున్నాయి. అనేక మంది సొంత ఫోన్‌ నంబరు, మెయిల్‌ ఐడీ కూడా ఇవ్వడం లేదు. ఇంటర్నెట్‌ నిర్వాహకులు తమ ఫోన్‌ నంబర్లు, మెయిల్‌ ఐడీ ఇస్తున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత పొరపాట్ల సవరణ చేసుకోవాలని, ఫలానా సమాచారం కావాలని మేం ఆయా నంబర్లకు ఎస్‌ఎంఎస్‌లు, మెయిళ్లకు వివరాలు పంపిస్తాం. అవి చాలామంది విద్యార్థులకు చేరటం లేదు. చివర్లో కంగారు పడుతూ ఫోన్లు చేస్తుంటారు. హైదరాబాద్‌లోని ఎంసెట్‌ కార్యాలయానికి వస్తుంటారు. 

గతేడాది వందల మందికి ర్యాంకులు ప్రకటించని పరిస్థితిని ఎలా అధిగమించబోతున్నారు? 

ఇంటర్‌/12వ తరగతి మార్కులకు ఈసారి యథావిధిగా 25 శాతం వెయిటేజీ ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించింది. ఎంసెట్‌కు తెలంగాణ, ఏపీ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, సార్వత్రిక విద్యాపీఠాలు, ఆర్‌జీయూకేటీ తదితర పలు బోర్డుల విద్యార్థులు హాజరవుతారు. గత ఏడాది ఆయా బోర్డుల నుంచి మార్కులు అందక కొంత మంది ర్యాంకులు ప్రకటించని మాట వాస్తవమే. ఈసారి ముందుగానే ఆయా బోర్డులకు లేఖలు రాసి తెప్పించుకుంటాం. అప్పటికీ పంపించకుంటే మాత్రం విద్యార్థులే సొంతగా ఇవ్వాల్సి ఉంటుంది.

ఎంసెట్‌లో ఎటువంటి మార్పులుంటాయి? 

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలోని 70 శాతం సిలబస్‌కే వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నందున ఎంసెట్‌కు కూడా ఆ సిలబస్సే ఉంటుంది. ప్రధాన మార్పు అదే. ఇక ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇతరత్రా మార్పులు ఏమీ ఉండకపోవచ్చు. 

కొవిడ్‌ సంబంధిత జాగ్రత్తలు ఎలా ఉండనున్నాయి? 

వచ్చే జులై 5 నుంచి ఎంసెట్‌ జరగనున్నందున కొద్ది నెలలు గడిచిన తర్వాత కరోనా పరిస్థితులను బట్టి ప్రభుత్వం నిర్ణయం మేరకు సురక్షిత దూరం తదితర నిబంధనలు పాటిస్తాం. ఆన్‌లైన్‌ పరీక్షలైనందున ప్రశ్నపత్రం లీకేజీకి అవకాశం లేదు. ఎంసెట్‌లో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ విభాగాలకు కలిపి దాదాపు 2.25 లక్షల దరఖాస్తులొస్తాయి. ఈసారి కూడా అయిదు శాతం అటూఇటుగా రావొచ్చు.

Previous
Next Post »
0 Komentar

Google Tags