Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Rationalization process before teachers transfers

టీచర్ల బదిలీల మార్గదర్శకాలు వారంలోగా విడుదలయ్యే అవకాశం.. 

-బదిలీలకు ముందుగానే క్రమబద్ధీకరణ ప్రక్రియ..
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. బదిలీల నిర్వహణకు ముందుగానే టీచర్స్‌ క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపట్టాలని సర్కార్‌ నిర్ణయించింది. విద్యా సంవత్సరం ఆరంభానికి ముందుగానే బదిలీలు, రేషనలైజేషన్‌ ప్రక్రియ చేపట్టాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయానికి ఆర్థికశాఖ గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. రేషనలైజేషన్‌, బదిలీలపై గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌, పాఠశాల విద్య కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు ప్రత్యేకంగా సమావేశమై సూచనలు, సలహాలు స్వీకరించారు.
ఉపాధ్యాయ సంఘాల సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే పరిశీలనను ప్రారంభించింది. సంఘాలు సూచించిన విధంగా రేషనలైజేషన్‌, బదిలీలు చేపట్టేందుకు వీలుగా రెండోసారి ఫైల్‌ను ఆర్థికశాఖకు విద్యాశాఖ పంపించినట్లు తెలిసింది. వారం రోజుల్లోగా బదిలీలు, రేషనలైజేషన్‌ నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కరోనా వైరస్‌ నేపథ్యంలో వెబ్‌ ఆధారంగా బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానం వల్ల కొంతమంది ఉపాధ్యాయులకు నష్టం జరిగే అవకాశం ఉన్నందున సాధారణ పద్ధతిలోనే (మాన్యువల్‌) బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. దీనిపై ప్రధాన ఉపాధ్యాయ సంఘాలతోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు సైతం విద్యాశాఖ అధికారులను కలసి విన్నవించారు. కొవిడ్‌ మార్గదర్శకాల ప్రకారం బదిలీల నిర్వహణకు ఉపాధ్యాయులు పూర్తిగా సహకరిస్తారని వారు ఉన్నతాధికారులకు తెలిపారు.
రాష్ట్రంలో సింగిల్‌ టీచర్స్‌ ఉన్న స్కూళ్లకు రెండో పోస్టు మంజూరుకు ప్రభుత్వం సంసిద్ధతను తెలిపింది. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి విషయంలో మాత్రం 1 : 30నే అనుసరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనివల్ల ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్‌జీటీ) పోస్టులు రద్దయ్యే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లాయి. అయితే, ఎక్కడా ఒక్క ఎస్‌జీటీ పోస్టు రద్దు కాకుండా చర్యలు చేపడతామని విద్యాశాఖ అధికారులు హామీ ఇచ్చారు. 
పాఠశాలలో 40 నుంచి 60 మంది విద్యార్థులుంటే మూడో పోస్టును మంజూరు చేయాలని సంఘాలు ఇప్పటికే ప్రతిపాదించాయి. అవసరం దృష్ట్యా విద్యా వలంటీర్లను ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా బదిలీలు చేపట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags